January 1, 2020

దేశమును ప్రేమించుమన్నా

గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ఈ ప్రముఖ గేయానికి ద్వారం వెంకటస్వామి నాయుడు స్వరాలను కూర్చారు. దీనిని కృష్ణా పత్రిక 1913 ఆగస్టు 9 తేదీన ప్రచురించింది. అందులోని కొంత భాగాన్ని ఇద్దరు పేరెన్నికగన్న గాయనీమణులు గానం చేసారు.

గానం: టంగుటూరి సూర్యకుమారి

గానం: శ్రీరంగం గోపాలరత్నం

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయీ...
వెనక చూసిన కార్యమేమోయి?
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనుకె నోయి!

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయి

దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి,
నరుల చమటను తడిసి మూలం,
ధనం పంటలు పండవలెనోయి!

ఆకులందున అణగిమణగీ
కవిత కోయిల పలకవలెనోయి;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయి!